అమరావతి:Y. S. షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, దివంగత నేతలు Y.S.రాజశేఖర రెడ్డి (వైఎస్సార్), Y. S. రాజా రెడ్డి లపై చేస్తున్న ఆరోపణలు రాజకీయ అక్కసుతో కూడిన దుష్ప్రచారమని విమర్శించారు. సంజాయిషీ ఇచ్చుకోలేని వ్యక్తులపై ఆరోపణలు చేయడం ద్వారా తెలుగు దేశం పార్టీ తమ రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.“నిజంగా వారు అంత దుర్మార్గులే అయితే, గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు విచారణ జరపలేదు? ఎందుకు శిక్షించలేదు? ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ప్రజలకు చెప్పుకోదగ్గ విజయాలు లేకనే ఈ విమర్శలు చేస్తున్నారా?” అని ఆమె ప్రశ్నించారు.వైఎస్ రాజారెడ్డి రాయలసీమలో పేదల పక్షాన నిలబడి సేవలు అందించిన వ్యక్తి అని షర్మిల పేర్కొన్నారు. కడప ప్రజల కోసం ఆసుపత్రి నిర్మాణం, పేద విద్యార్థుల కోసం విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం వంటి సేవలు చేశారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి చరిత్రను వక్రీకరించి తప్పుగా చిత్రీకరించడం రాయలసీమ ప్రజలు సహించరని అన్నారు.అలాగే, వైఎస్సార్ పాలనను సంక్షేమం, అభివృద్ధికి ప్రతీకగా అభివర్ణించిన ఆమె, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని చెప్పారు. N.చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఎన్నికల హామీల అమలులో వైఫల్యం చెందిందని ఆరోపించారు.వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయనపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజల ఆదరణ తగ్గదని షర్మిల వ్యాఖ్యానించారు. ఇకనైనా రాజకీయ విమర్శలను పక్కనబెట్టి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

