బ్రహ్మంగారిమఠం, ఆగస్టు 12: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం జి. నరసింహాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చేనుబోయిన సుబ్బరాయుడు అప్పుల బాధతో పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల సమాచారం మేరకు.. నాలుగు రోజుల క్రితం అప్పు ఇచ్చిన వ్యక్తి సుబ్బరాయుడు ఇంటి వద్దకు వచ్చి దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుబ్బరాయుడు అవమానంగా భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: