అమరావతి:
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండుగ కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు.
ఉద్యోగులకు ఒక డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ డీఏ నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.160 కోట్ల భారమయ్యే అవకాశం ఉందని సీఎం తెలిపారు.
అలాగే పోలీసు సిబ్బందికి ఒక సరెండర్ లీవ్ను క్లియర్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ చెల్లింపులు రెండు విడతల్లో జరుగుతాయని చెప్పారు. మొత్తం రూ.210 కోట్లు రెండు విడతల్లో విడుదల చేయనున్నట్లు వివరించారు.
అదే సమయంలో, వచ్చే 60 రోజుల్లోగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ స్ట్రీమ్లైన్ చేయనున్నట్టు చెప్పారు. ఆరోగ్య పరమైన వ్యయాలను రియల్ టైమ్లో పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
మహిళా ఉద్యోగులకు పెద్ద ఊరటగా, 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ను రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఈ లీవ్ వినియోగానికి వయోపరిమితి ఉండదని తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ ప్రమోషన్లు త్వరలో క్లియర్ చేస్తామని చెప్పారు. ఉద్యోగ సంఘాల భవనాలకు సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ను మాఫీ చేయనున్నట్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు.
అంతేకాకుండా, 4వ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా రీడెసిగ్నేట్ చేయనున్నట్లు వెల్లడించారు.
సీఎం చేసిన ఈ ప్రకటనలతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీపావళికి ముందే ప్రభుత్వం నుంచి శుభవార్త అందిందని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

