విజయనగరం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజాంకు చెందిన ముంజేటి సతీష్, స్పందన(34) దంపతులకు 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన అతడు, పాఠశాలలో ఓ విద్యార్థినికి ప్రేమలేఖ రాయడంతో విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లింది.దీంతో “మంచిగా ఉండు, చెడు స్నేహాలకు దూరంగా ఉండు, బాగా చదువుకో” అంటూ తల్లి స్పందన తరచూ మందలించేదని సమాచారం. ఈ కారణంగా కుమారుడిలో తల్లిపై అసహనం పెరిగినట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలో క్రికెట్ ఆడే సమయంలో పరిచయమైన మరో బాలుడితో కలిసి హత్యకు పథకం వేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 4న స్పందన తన పుట్టింటికి వెళ్లిన సమయంలో, స్నేహితుడిని ఇంటికి పిలిపించి బీరువాలోని బంగారం, నగదు తీసుకున్నట్లు సమాచారం.తర్వాత తనకు ఆకలిగా ఉందని చెప్పి అమ్మమ్మ ద్వారా తల్లిని ఇంటికి రప్పించారు. స్పందన ఇంటికి వచ్చి చేతులు కడుక్కుంటున్న సమయంలో, కుమారుడి స్నేహితుడు ఆమె గొంతు పట్టుకోగా, ఇద్దరూ కలిసి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహంపై సుమారు 16 కత్తిపోట్లు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.హత్య అనంతరం మృతదేహాన్ని చీరలో చుట్టి సమీపంలోని కోనేరులో పడేసినట్లు సమాచారం. స్పందన కనిపించకపోవడం, కుమారుడు కూడా అదృశ్యమవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.నిందితులు భువనేశ్వర్, ముంబై, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో తిరిగిన అనంతరం పలాస వైపు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

