శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని కొత్తూరు మండలం, పొన్నుటూరు పంచాయతీ పరిధిలోని పొంటూరు–బంకి ప్రాంతాల్లో వంశధార నది గర్భంలో అక్రమ ఇసుక తవ్వకాలు బహిరంగంగానే కొనసాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీ యంత్రాలతో నది మధ్యలో రోడ్లు ఏర్పాటు చేసి ప్రతిరోజూ వందలాది వాహనాల ద్వారా ఒడిశా రాష్ట్రానికి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక అధికారులతో పాటు రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ వ్యవహారం కొనసాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇస్తే ఏం చేసినా పట్టించుకోవడం లేదని కొందరు స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అక్రమ ఇసుక తవ్వకాలపై పలు మార్లు ఫిర్యాదులు వెళ్లినా, పత్రికల్లో కథనాలు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంశధార నది సహజ ప్రవాహం దెబ్బతింటోందని, పర్యావరణానికి నష్టం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో అక్రమ తవ్వకాలను తక్షణమే అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వంశధార నదిని కాపాడేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
గమనిక: ఇవి స్థానికులు చేసిన ఆరోపణలు మాత్రమే. సంబంధిత అధికారులు లేదా ప్రజాప్రతినిధుల స్పందన వెలువడాల్సి ఉంది.

