నేపాల్లో (Nepal) పరిస్థితులు క్షణక్షణం మారుతున్నాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి, రాజకీయ వారసత్వానికి వ్యతిరేకంగా జెన్ జెడ్ యువత చేపట్టిన ఉద్యమం చివరికి హింసాత్మక ఘటనలకు దారి తీసింది. ప్రధాని కేపీ శర్మ ఓలి (K.P. Sharma Oli) సహా పలువురు మంత్రుల ఇళ్లు ఆందోళనకారులు తగలబెట్టగా, పార్లమెంట్, సుప్రీంకోర్టు భవనాలకూ నిప్పు పెట్టారు. దేశవ్యాప్తంగా అల్లర్లు రగిలిపోవడంతో ఇప్పటివరకు 22 మంది మృతి, 300 మందికి పైగా గాయాలు జరిగినట్లు సమాచారం. చివరికి ఓలి తన పదవికి రాజీనామా చేయగా, ప్రభుత్వం కూలిపోయింది.
11 ఏళ్ల బాలిక ఘటన – తిరుగుబాటుకు నాంది.
ఆగస్టు ప్రారంభంలో ఓ మంత్రి కారు పాదచారుల క్రాసింగ్ వద్ద 11 ఏళ్ల బాలికను ఢీకొట్టింది. బాలిక గాయపడి రోడ్డుపై పడిపోగా, మంత్రి కారు ఆగకుండా వెళ్లిపోయింది. స్థానికులు డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించినా, 24 గంటల్లోనే విడుదల చేశారు.
దీన్ని “చిన్న సంఘటన”గా కొట్టిపారేసిన ప్రధాని ఓలి వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని రెచ్చగొట్టాయి. బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, #JusticeForTheGirl హ్యాష్ట్యాగ్తో విస్తృత స్థాయిలో ప్రచారం సాగింది.
సోషల్ మీడియా నిషేధం – ఆగ్రహానికి తెరలేపిందిప్రజా వ్యతిరేకత పెరగడంతో సెప్టెంబర్ 4న ప్రభుత్వం WhatsApp, Facebook, Instagram, X, YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను నిషేధించింది. దీనితో యువత మరింతగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
యువత ఆందోళనలు – రక్తపాతంసెప్టెంబర్ 8న కాట్మాండు సహా పలు నగరాల్లో Gen Z ఉద్యమంగా నిరసనలు ముదిరాయి. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనన్లు వినియోగించగా ఘర్షణల్లో 19 మంది మృతి చెందారు. ఆ రాత్రే ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేసింది.అయినా ఆందోళనలు ఆగలేదు. మరుసటి రోజు యువత ప్రధాని, మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టగా, పరిస్థితులు అదుపు తప్పాయి. చివరికి ప్రధాని ఓలి రాజీనామా చేయగా, ఇతర మంత్రులు కూడా పదవులు వదిలారు.
ఆర్మీ జోక్యంప్రస్తుతం నేపాల్లో అధికారాన్ని ఆర్మీ స్వాధీనం చేసుకుంది. శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తూ, ప్రజలకు సంయమనం పాటించాలని సూచిస్తోంది.
అనూష

