జనగామ జిల్లా, లింగాలఘనపురం మండలం:
నెల్లుట్ల గ్రామంలో ఆదివారం హృదయాన్ని కదిలించిన సంఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులు వచ్చిన కనకలక్ష్మి అనే గర్భిణీ మహిళకు కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అయితే వాహనం ఆలస్యంగా రావడంతో ఆమెను ఆటోలో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.
మార్గమధ్యంలోనే నెల్లుట్ల వద్ద నొప్పులు తీవ్రమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఆశావర్కర్లు అరుణ, పుష్ప, ఉమ తక్షణమే స్పందించి ఆటోను ఆపించి ప్రసవం నిర్వహించారు. వారి సహకారంతో కనకలక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చింది.
తరువాత తల్లి, శిశువును సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపారు. అంబులెన్స్ ఆలస్యమైనా, ఆశా వర్కర్ల చొరవతో తల్లి, బిడ్డ ప్రాణాలు కాపాడబడ్డాయి.
స్థానికులు ఆశావర్కర్ల ధైర్యసాహసాన్ని అభినందించారు.

