వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని మామిళ్లపల్లె సమీపంలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి చారిత్రక కేసీ (కర్నూలు–కడప) కెనాల్ అక్విడెక్ట్ (పిచ్చపాడ్ అక్విడెక్ట్) కట్టడంపై పెరిగిన మొక్కలు, పొదలను శనివారం వివిధ స్వచ్ఛంద సంస్థలు, రైతు ప్రతినిధుల సహకారంతో విజయవంతంగా తొలగించారు.నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, చారిత్రక కట్టడంపై మొక్కలు పెరుగుతూ ఉంటే వాటి వేర్ల ప్రభావంతో గోడల్లో చీలికలు ఏర్పడి, నీటి లీకేజీలు సంభవించే ప్రమాదం ఉందన్నారు. దీని వల్ల భవిష్యత్తులో కట్టడం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ప్రమాదం గురించి రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ ముందుగానే అవగాహన కల్పించారని నిర్వాహకులు తెలిపారు. చారిత్రక వారసత్వాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో శ్రమదానంగా ఈ మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో సహస్ర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చెన్నంరెడ్డి నాగమల్లారెడ్డి, మధుసూదన్ రెడ్డి, మైదుకూరు అమ్మ సేవా సమితి అధ్యక్షుడు శివశంకర్, మైదుకూరు నేస్తం సేవా సమితి సభ్యుడు కోగటం కొండారెడ్డి, కర్షకరత్న అవార్డు గ్రహీత పందిటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొని కట్టడంపై పెరిగిన మొక్కలను తొలగించారు.చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని, ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

