గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందేనని కూటమి ప్రభుత్వం సూచించింది. ఉద్యోగుల దగ్గర ఉండే యాప్లో ఉదయం, సాయంత్రం హాజరు నమోదుకు మార్గదర్శకాలిచ్చింది. ఈ మేరకు యాప్లో కొన్ని మార్పులు చేశారు. GSWS అటెండన్స్ యాప్ వెర్షన్ 2.2లో ఉదయం 10.30 గంటల లోపు మాత్రమే హాజరు తీసుకుంటుంది. సాయంత్రం అయిదు తర్వాత కచ్చితంగా బయోమెట్రిక్ వేయాల్సిందే. అలావేస్తేనే ఒక రోజు పూర్తి వేతనం వస్తుందని, ఎవరైనా ఉద్యోగి ఉదయం ఒకసారి హాజరు నమోదు చేసి సాయంత్రం వేయకపోతే ఆ రోజు క్యాజువల్ లీవ్ (సీ’ ఎల్)గా పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు.ఉమ్మడి జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరం, తణుకు, ఉండి, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో కొంత మంది ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడిన ఘటనలున్నాయి. అవి ప్రభుత్వానికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేశారు. అది కూడా ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ ఉండేది. ఉదయం 9, మధ్యాహ్నం 2, సాయంత్రం 5 గంటలకు హాజరు వేయాలి. మూడుసార్లు బయోమెట్రిక్ హాజరు అనడంతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం ఈ హాజరు విషయంలో మార్పులు చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అటెండన్స్ యాప్ లో మధ్యాహ్నం సమయం తొలగించారు.సచివాలయ ఉద్యోగులు చాలా మంది ఉదయం 11 గంటలు దాటితే కానీ విధులకు హాజరు కావడం లేదని, పైగా సాయంత్రం అయిదు గంటలకు ముందే వెళ్లిపోతున్నారని ఫిర్యాదులు రావడంతోనే సమయపాలన విషయంలో ఆంక్షలు విధించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సిన ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ సహాయకులు, విద్యుత్తు లైన్మెన్ల విషయంలో హాజరు నిబంధన ఇబ్బందికరంగా మారింది. అటువంటి వారి విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ఉద్యోగులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నామని పశ్చిమగోదావరి జిల్లా GSWS జిల్లా అధికారి దోసిరెడ్డి తెలిపారు.
https://youtube.com/@tv424x7?si=I16_aui-_ktesBCu

