ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగిస్తే ఇక తిరుగుబాటే..!
గిరిజన యువ నేత ఆకాష్ నాయక్ ప్రభుత్వంపై ఆగ్రహం
గిరిజనుల భవిష్యత్తుతో చలగాటమాడితే ఖబర్దార్…!
లంబాడాలపై అసత్య ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయాలి .
తెల్లం వెంకట్రావు,సోయం బాబురావులపై తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి.
ఎస్టీ జాబితా నుంచి బంజారా, లంబాడీ, సుగాలి గిరిజనులను తొలగించాలన్న కుట్రను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని గిరిజన యువ నాయకుడు ఆకాష్ నాయక్ డిమాండ్ చేశారు. 1976లో అధికారికంగా ఎస్టీ జాబితాలో చేర్చబడిన లంబాడీలను, ఇప్పుడు రాజకీయ లాభాల కోసం వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గిరిజన హక్కులను కాజేయాలని చూస్తే ఇక మేము నిశ్చలంగా కూర్చోము. లంబాడీలు, గిరిజనులు, బంజారాలు ఒకే గొంతుతో ఐక్యమత్యంగా ఉద్యమిస్తారు. ఈ అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఆందోళనలు రగులుతాయి. రాస్తారోకోలు, బందులు, నిరసనలు తప్పవు. మా భవిష్యత్ తరాలకు అన్యాయం జరగకుండా చివరి వరకు పోరాడతామని ఆకాష్ నాయక్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలతో గిరిజన సమాజాన్ని విభజించకూడదని హెచ్చరించిన ఆయన, మా ఉనికి, మా గుర్తింపు, మా హక్కుల కోసం అవసరమైతే తిరుగుబాటుకే సిద్ధం అవుతాము. ఇది కేవలం లంబాడీల సమస్య కాదు, ఇది గిరిజనుల గౌరవం, భవిష్యత్తు అని గట్టిగా పేర్కొన్నారు. గిరిజన సమాజం మొత్తం ఈ అంశంపై అప్రమత్తంగా ఉండాలని, ఎస్టీ జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆకాష్ నాయక్ పిలుపునిచ్చారు…𝗚𝗡𝗥