CM Revanth: హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు నగారా మోగిందని.. ఇప్పటి నుంచి తన రాజకీయం ఏంటో బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలకు చూపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ( CM Revanth Reddy) హెచ్చరించారు..కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం నాడు జరిగిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. నిజాం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా.. నిరంకుశత్వాన్ని ప్రయోగించారని అన్నారు. ఖాసిం రజ్వీ తెలంగాణలో తన ఆధిపత్యం, అధికారంపై తిరుగుబాటు చేసిన వారిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అణిచివేసే ప్రయత్నం చేశారన్నారు. సచివాలయం, కాళేశ్వరం లాంటివి చూపి ప్రజల స్వేచ్ఛను హరించారని చెప్పారు.75 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు పోరాడి మళ్లీ స్వేచ్ఛను తెచ్చుకున్నారని అన్నారు. కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారని అన్నారు. నిజాం విధానాల నకలును కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేశారని మండిపడ్డారు. అందుకే ప్రజలు కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు. వంద రోజుల ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించామని తెలిపారు. 6 గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇన్నాళ్లు కవులు, కళాకారులను కేసీఆర్ తన గడీలో బంధించారని ధ్వజమెత్తారు. దొరగారి (కేసీఆర్) భుజకీర్తులను సాగించాలని తెలంగాణ సాంస్కృతిక చరిత్రపై దాడి చేశారన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని అన్నారు. ప్రగతి భవన్ ముళ్ల కంచెను బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛను కల్పించామన్నారు. రాష్ట్ర పరిపాలనను నిర్దేశించే సచివాలయంలో అందరికీ ప్రవేశం కల్పించామని తెలిపారు. తాము పాలకులం కాదు.. సేవకులం అని తెలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.అక్రమార్కులను విడిచి పెట్టం..”కొద్దిమంది అవినీతి అధికారులతో సాగించిన కేసీఆర్ పాలనకు స్వస్తి చెప్పాం. పరిపాలన వికేంద్రీకరణ చేసి పారదర్శక పాలన అందించే ప్రయత్నం చేశాం. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ పథకాలను అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 8లక్షల కుటుంబాలకు రూ.500 గ్యాస్ సిలిండర్ అందించాం. 200 యూనిట్ల ఉచిత కరెంటును అమలు చేశాం. మాజీ మంత్రి హరీష్రావు ఇంటిపేరులో తన్నీరు ఉన్నంత మాత్రానా ఆయన పన్నీరు కాదు.. జీరో బిల్ను మేం అమలు చేస్తుంటే హరీష్రావు అతి తెలివి తేటలు ఉపయోగించి అడ్డుకోవాలని చూస్తున్నారు. అక్రమార్కలు ఎంతటి వారైనా విడిచిపెట్టం. జీరో బిల్లుతో పేదలకు ఉచిత కరెంటు అందిస్తోంటే.. కొంతమంది అడ్డు తగులుతున్నారు. వాళ్ల అడ్డు తొలగించి పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేసి తీరుతాం. మేం అప్పుల గురించి మాట్లాడితే వాళ్లు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంపై రూ.9 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.6 వేల కోట్లని.. కానీ ఇప్పుడు ఏడాదికి రూ.64 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి రాష్ట్రాన్ని కేసీఆర్ తీసుకొచ్చారు.. ప్రతీ ఏడాది రూ.70 వేల కోట్లు అప్పుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వంతో, తెలంగాణ గవర్నర్ తమిళిసైతో సామరస్యపూర్వక విధానాలతో ముందుకెళ్తున్నాం. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. మీ అందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందిస్తాం. వైబ్రాంట్ తెలంగాణనే మా లక్ష్యం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి వేల కోట్లకు చేరింది… చట్టబద్ధంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. బతుకమ్మను కొందరు వ్యాపార వస్తువుగా, ఆటవస్తువుగా మార్చారు. బతుకమ్మ, బోనాలు అనాదిగా తెలంగాణలో జరుపుకుంటున్న పండుగలు.. ఎవరు ఉన్నా.. ఎవరు లేకున్నా… బతుకమ్మ, బోనాల పండుగలు ఘనంగా జరుగుతాయి. ప్రైవేట్ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించాం. ధరణి పోర్టల్ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే తప్ప.. అవినీతి జరిగిందా లేదా అనే విషయం బయటపడదు. తప్పులకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదు” అని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు.
