మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న కొడుకు కోసం కర్పూరంలా కరిగిపోయింది ఆమె.
కానీ ఇతర పిల్లల మాదిరిగా బతకలేక కొడుకు పడుతున్న బాధను చూడలేక, తమ కోసం రెక్కలుముక్కలు చేసుకుంటున్న భర్త కష్టం తాళలేక దారుణ నిర్ణయం తీసుకుంటుంది.
సాక్షి చావ్లా అనే మహిళ భర్త దర్పణ్ చావ్లా, కుమారుడు దక్ష (11) కలిసి గ్రేటర్ నోయిడాలోని ఏస్ సిటీలో ఓ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. భర్త దర్పణ్ చార్టర్డ్ అకౌంటెంట్. కుమారుడు దక్షకు పుట్టినప్పటి నుంచి మానసిక ఎదుగుదల లేదు. ఖరీదైన చికిత్స చేయించినా కుమారుడి పరిస్థితి ఎంతకూ మెరుగుపడకపోవడంతో సాక్షి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆమె, కొడుకు దక్షను తీసుకుని తమ అపార్ట్మెంట్ 13వ అంతస్తు నుంచి కుమారుడితో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన సమయంలో భర్త ఇంట్లోనే వేరే గదిలో ఉన్నాడు. వారి అరుపులు విని బాల్కనీలోకి పరుగులు తీసిన దర్పణ్ అప్పటికే తన భార్య కుమారుడితో సహా నేలపై రక్తం మడుగులో పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు ముందు సాక్షి రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అందులో మేము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాము. క్షమించండి. మేము ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నాము. మా కారణంగా మీ జీవితం నాశనం కాకూడదు. మా మరణానికి ఎవరూ బాధ్యులు కాదు. మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్న కుమారుడి వల్ల తీవ్ర వేదనకు గురవుతున్నట్లు సూసైడ్ నోట్లో సాక్షి తెలిపింది. తమ కోసం భర్త దర్పణ్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడని, భర్తను ఇబ్బంది పెట్టలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సెంట్రల్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శక్తి అవస్థి అన్నారు.

