తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మరోసారి చర్చలు ముమ్మరమవుతున్నాయి. ఈనెల 30వ తేదీతో హైకోర్టు ఇచ్చిన గడువు ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికలు నిర్వహించాలా? లేక వాయిదా వేయాలా? అన్న దానిపై ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో మంత్రులు, న్యాయ నిపుణులు పాల్గొననున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అమలు అంశం కేంద్రంగా చర్చించనున్నారు.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఎన్నికలు వెంటనే నిర్వహిస్తే బీసీ రిజర్వేషన్ల కేటాయింపులో చట్టపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే న్యాయపరమైన మార్గాలు ఏమిటి? హైకోర్టులో గడువు పొడిగింపు సాధ్యమా? అన్న దానిపై నిపుణుల సలహాలు తీసుకోవాలని సీఎం నిర్ణయించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడితే, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు దీనిని ప్రభుత్వంపై ఒత్తిడి సృష్టించే ఆయుధంగా వాడుకోవచ్చని అంచనా.

