ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం దారగానిపాడు గ్రామంలో జరిగిన దారుణ హత్య కేసుపై సీఎం చంద్రబాబు మానవతా హృదయంతో స్పందించారు. ఈ నెల 2న చోటుచేసుకున్న ఈ ఘటనలో లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని టీడీపీకి చెందిన హరిశ్చంద్రప్రసాద్ కారు ఢీకొట్టి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ ఘటనకు కులరంగు చేరడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.దీపావళికి ముందు రోజు సీఎం చంద్రబాబు ఈ ఘటనపై స్పందిస్తూ, మంత్రులు నారాయణ, అనితలను గ్రామానికి పంపించి బాధిత కుటుంబాన్ని పరామర్శింపజేశారు. అనంతరం స్వయంగా ఫోన్ చేసి కుటుంబానికి ధైర్యం చెప్పారు. నేరస్థులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కేసును వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.తాజాగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా సీఎం అధికారులతో చర్చించి, ఆర్థిక సహాయం ప్రకటించారు. వ్యవసాయ కుటుంబం కావడంతో భూమి రూపంలోనూ, నగదు రూపంలోనూ పరిహారం అందించేలా నిర్ణయం తీసుకున్నారు. మొదట సుజాతకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆలోచించినా, ఆమె వ్యవసాయానికే మొగ్గుచూపడంతో భూమి మంజూరు చేశారు.
పరిహారం వివరాలు ఇలా:
లక్ష్మీనాయుడు భార్య సుజాతకు: 4 ఎకరాల పొలం + ₹5 లక్షలు
ఇద్దరు పిల్లలకు: 4 ఎకరాల పొలం + ₹5 లక్షలు (ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో)
సోదరుడు పవన్కు: 4 ఎకరాల పొలం + ₹5 లక్షలు
సోదరుడు భార్గవ్కు: ₹3 లక్షలు
మొత్తంగా 12 ఎకరాల భూమి, ₹18 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
📍 దారగానిపాడు దారుణానికి స్పందించిన సీఎం చంద్రబాబు – బాధిత కుటుంబానికి బలమైన భరోసా.

