ఉచితాల కంటే విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలని సూచన
అమరావతి:మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. ప్రజల సంక్షేమం పేరుతో ఉచిత పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వ తీరుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా అసలు ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. “ప్రభుత్వం ప్రజల కోసం చేసే పనులు స్థిరమైన అభివృద్ధికి దారితీయాలి. ఉచితాలపై కాకుండా విద్య, వైద్య రంగాలపై ఎక్కువగా పెట్టుబడి పెట్టాలి” అని వెంకయ్య నాయుడు సూచించారు.“విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయి. వైద్యం ప్రతి మనిషికి అత్యవసరం. ఈ రెండు రంగాల్లో పెట్టుబడి పెడితేనే సమాజం ముందుకు వెళ్తుంది” అని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై కూడా వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వం తన ఆర్థిక స్థితిగతులను శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలియజేయాలి. ఐదేళ్లలో ఎంత అప్పు తీసుకున్నారు, ఎంత తిరిగి చెల్లించారు అన్న వివరాలు స్పష్టంగా చెప్పాలి” అని ఆయన కోరారు.అలాగే సభలో లేనివారి పట్ల అమర్యాదకర వ్యాఖ్యలు చేయకూడదని సలహా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవం, మర్యాద అవసరమని ఆయన అన్నారు.

