ఆయనో జాతీయ పార్టీ అధినేత. ఎన్డీయే కూటమి భాగస్వామిగా ఉన్నారు. పైగా మోదీ క్యాబినెట్లో కేంద్రమంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి నేత తెలంగాణలో తన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కు వచ్చారు. అంతవరకు బానే ఉంది. కానీ ముందుగా సీఎం రేవంత్రెడ్డిని..ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఇక్కడే చర్చ మొదలైంది. ఆ ఇద్దరితో ఆయన భేటీలో చర్చించిందేంటి? కేంద్రమంత్రి కాంగ్రెస్ సీఎంను కలవడంలో అంతర్యమేంటి? బీజేపీని వ్యతిరేకిస్తున్న కవితతో ఎందుకు భేటీ అయినట్లు.?కేంద్ర మంత్రి జయంత్ చౌదరి..తెలంగాణ పర్యటన హాట్ టాపిక్గా అయింది. ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి తన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్కు వచ్చారు. ఆయన పార్టీ ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటి. పైగా మోదీ క్యాబినెట్లో మంత్రి హోదాలో కొనసాగుతున్నారాయన. అలాంటి జయంత్ చౌదరి తెలంగాణ పర్యటనకు వచ్చి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం వరకు బానే ఉన్నా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి మరీ కలిశారు.అంతటితో ఆగకుండా బీఆర్ఎస్పై అసంతృప్తి గళం వినిపిస్తున్న ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. జయంత్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవితను కలవడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అది కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయిన వెంటనే కవితను కలవడంలో జయంత్ చౌదరి ఆంతర్యం ఏంటన్నది ఎవ్వరికి అంతుపట్టడం లేదు.కేంద్ర నైపుణ్యాభివృద్ధి, విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి వ్యవహారశైలి రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్లో రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ ఆఫీస్ను ప్రారంభించి..మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ను తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడిగా నియమించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అసంతృప్త ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితలను కలవడమే ఇంట్రెస్టింగ్గా మారింది. రాష్ట్రీయ లోక్ దళ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు జయంత్ చౌదరి.ఇలా రేవంత్ సర్కార్పై అటాక్ చేశారో లేదో..అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మరీ ఆయనను కలిశారు. వీరిద్దరి మధ్య తాజా రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తనకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న కారణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ను తన పార్టీ రాష్ట్రీయ లోక్దళ్కు తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన జయంత్ చౌదరి..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటికి వెళ్లి మరీ కలవడమే రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.ఇక కేంద్ర మంత్రి జయంత్ చౌదరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలవడం మరింత ఆసక్తిని పెంచుతోంది. అది కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశాక కవితతో భేటీ అవ్వడం రాజకీయవర్గాల్లో ఇంట్రస్టింగ్ మారింది. కవిత నివాసానికి వెళ్లి ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు జయంత్. కేసీఆర్కు కవిత రాసిన లేఖ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో కేంద్రమంత్రి జయంత్ చౌదరి వరుసగా రేవంత్ రెడ్డి, కవితలను కలవడం పొలిటికల్ హాట్ టాపిక్గా మారింది.గతంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఆర్ఎల్డీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జయంత్ చౌదరి.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం కలవలేదు. కానీ ఆయన కూతురు, గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్న కవితను మాత్రం కలవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో జయంత్ చౌదరి కవితను ఆర్ఎల్డీలోకి ఆహ్వానించారన్న టాక్ కూడా బయలుదేరింది.జయంత్ చౌదరి ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు, అంటు ఎమ్మెల్సీ కవితను కలిసినప్పుడు ఆయనతో తమ పార్టీ తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు దిలీప్ కుమార్ మాత్రం లేరు. దీంతో అసలు జయంత్ చౌదరి రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు, ఆ తర్వాత కవితను కలవడానికి గల కారణమేంటని ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పోనీ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అధికారిక పర్యటనలో భాగంగా భేటీ అయ్యారని అనుకున్నా..రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై రేవంత్ రెడ్డిని జయంత్ చౌదరి ప్రత్యేకంగా అభినందించడం కలకలం రేపుతోంది.ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఎమ్మెల్సీ కవితను జయంత్ ఎందుకు కలిశారన్నది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఆయన కేంద్రమంత్రి కిషన్రెడ్డితో సహా రాష్ట్ర బీజేపీ నేతలను ఎవరినీ కలకపోవడం కూడా చర్చకు దారి తీస్తోంది. లోగుట్టు పేరుమాళ్ల కెరుక అన్నట్లు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, రేవంత్, కవితల భేటీల ఆంతర్యమేంటనేది ఇప్పటికైతే రహస్యంగానే ఉంది.
