కడప జిల్లా చాపాడు మండలం కుందు నదిలో ఈరోజు ఉదయం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం గత రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరులో కిడ్నాప్కు గురైన ఫైనాన్షియల్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డిదేనేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.స్థానికులు కుందు నదిలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చాపాడు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మృతదేహం పూర్తిగా వెలికితీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇక రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు పట్టణంలోని బొల్లవరం మున్సిపల్ ప్లాట్ల వద్ద వేణుగోపాల్ రెడ్డి కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయనపై దాడి చేసి కళ్లల్లో కారం కొట్టి ఎత్తుకెళ్లినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మృతదేహం లభ్యమవడం ప్రొద్దుటూరులో కలకలం రేపింది.మృతదేహం పూర్తిగా బయటకు రాగానే అది వేణుగోపాల్ రెడ్డిదేనో కాదో తేలనుంది. కిడ్నాప్ చేసిన నిందితులే హత్య చేసి కుందు నదిలో పడేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.జిల్లాలో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతను రేపగా, వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి వాస్తవాలను బయటపెట్టే పనిలో ఉన్నారు.
👉 పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మీ సమీపంలోని సమస్యలు మాకు పంపాలనుకుంటే మా మొబైల్ నెంబర్ : 8686186039

