అనంతపురం: పేద వాల్మీకి ప్రజల భూములను బలవంతంగా కాజేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వాల్మీకి సేవాదళ్ పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అనంతపురం జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ, తాడిపత్రి ప్రాంతానికి చెందిన కుల్లాయమ్మ భూమి (సర్వే నం.164C, 165C – గుత్తి-అనంతపురం హైవే వద్ద)ను మాసినేని రామయ్య, ఆయన సోదరుడి కుమారుడు అమరేంద్ర అక్రమంగా ఆన్లైన్లో తమ పేర్లపై ఎక్కించుకున్నారని ఆరోపించారు.
ఒకరి పేరుతో రిజిస్టర్ ఉన్న భూమిని మరో వ్యక్తి ఎలా ఆన్లైన్లో తమ పేరుతో చూపించగలరని ప్రశ్నించిన ఆయన, పేద వాల్మీకి ప్రజల భూములను ఆర్థిక బలం, రాజకీయ ప్రభావంతో దోచుకునే ప్రయత్నాలను ఖండించారు. “డబ్బు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు, హెచ్చరించినా సరిచేసుకోవడం లేదు. ఇక భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు” అని ఆయన విమర్శించారు.
కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వో తదితర అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పేద ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లంచాలతో అధికారులను ప్రభావితం చేసి కోర్టు పేరుతో భూములు కాజేయాలనే దురుద్దేశం ఉందని లింగమయ్య ఆరోపించారు.
“వీరికి న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకి సమాజాన్ని ఏకం చేసి ఉద్యమం చేస్తాం” అని హెచ్చరించారు. ఈ సమావేశంలో వాల్మీకి సేవాదళ్ చిన్న, భార్గవ, నారాయణస్వామి, చంద్ర, భార్గవి, లక్ష్మీదేవి, రామాంజినమ్మ తదితరులు పాల్గొన్నారు

