పులివెందుల లో పబ్లిక్ పరీక్ష నిర్వహణ తీరు
పులివెందుల పట్టణంలోని స్థానిక రవన్నప్ప సత్రం, రవీంద్రనాథ్ హై స్కూల్ లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తున్న తీరును చూసిన స్థానికులు పబ్లిక్ పరీక్షలంటే పకడ్బందీగా నిర్వహించేవని తెలియక ఇన్నాళ్లు భ్రమ పడ్డామని కానీ పబ్లిక్ పరీక్షలు అంటే పబ్లిక్ మధ్యలో రాసేవి అని అధికారులు మా కళ్ళు తెరిపించారంటూ చమత్కరించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఈ నెల 18వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు మొదలైన సంగతి పాఠకులకు విధితమే. ఇకపోతే పదవ తరగతి పరీక్షా కేంద్రాలు అయినటువంటి పులివెందుల పట్టణంలోని రవణప్ప సత్రం, రవీంద్రనాథ హై స్కూల్, రెండు పాఠశాలలు పక్క పక్కనే ఉంటాయి. రెండింటికి ఒకటే ప్రహరీ గోడ ముందువైపు పెద్ద మెయిన్ గేటు వెనుక వైపు నుండి పిల్లలు వచ్చేటందుకు చిన్న గేటు ను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఒకవైపు పరీక్ష జరుగుతుండగా పాఠశాల రెండు ప్రహరీ గోడ గేట్లను బార్లా తెరిచి ఉంచారు. ఇదే అదనుగా ప్రహరీ గోడ లోపల పరీక్షా కేంద్రాలకు అతి సమీపంలోకి కార్లు, బైకుల తో పదుల సంఖ్యలో అపరిచిత వ్యక్తులు గుంపులు గుంపులుగా సంచరించరిస్తూ కాలక్షేపం చేశారు. ఈ సంఘటన చూస్తుంటే పదవ తరగతి పరీక్షలను అధికారులు పబ్లిక్ లో ఎంత కోలాహాలంగా వేడుకగా నిర్వహించారో అర్థమవుతుంది. పబ్లిక్ పరీక్షలు జరిగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. చుట్టుపక్కల 100 మీటర్ల పరిధిలో ఎటువంటి జనసంచారం ఉండకూడదు అన్న నిబంధన తెలిసి కూడా ఈ రెండు పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు ఎటువంటి నిబంధనలు పాటించకుండా పరీక్షలను నిర్వహిస్తున్న తీరును చూసిన స్థానికులు విస్మయానికి గురి అయ్యారు.