అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి…జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్…
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో విస్తృతంగా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లు నిర్వహించి డయేరియా నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు.శుక్రవారం వెలగపూడి, సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అతిసార కేసుల వ్యాప్తి (స్టాప్ డయేరియా క్యాంపెయిన్), తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు.రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులతో మాట్లాడుతూ…. అన్నమయ్య జిల్లాలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లు విస్తృతంగా చేపట్టాలన్నారు. జిల్లాలో ఎక్కడా అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఇందుకోసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. జిల్లాలో అతిసార కేసుల వ్యాప్తి అరికట్టేందుకు కమ్యూనికేషన్ స్ట్రాటజీ, మానిటరింగ్ మెకానిజం అమలు చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేయాలని, ఆశా వర్కర్ ల ద్వారా తక్కువ బరువున్న చిన్నారులకు జింక్ ప్యాకెట్లను అందించాలన్నారు. ఆరోగ్య శాఖ సహకారంతో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు అంగన్వాడీలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ కార్నర్ను ఏర్పాటు చేయాలన్నారు. చిన్నారుల్లో గ్రోత్ మానిటరింగ్ నిర్వహించడంపై అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ ఇవ్వడం మరియు తక్కువ బరువున్న పిల్లలకు పోషకాహారం అందించడం చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా డయేరియా, అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు…