హైదరాబాద్:తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంతో పలు జిల్లాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర నిర్ణయం తీసుకుంది. ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు రూ.200 కోట్ల నిధులను విడుదల చేసింది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం, తీవ్ర నష్టం వాటిల్లిన ఏడు జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. అలాగే సాధారణ నష్టం వాటిల్లిన 26 జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.5 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, మౌలిక వసతుల పునరుద్ధరణ, తక్షణ ఉపశమనం కోసం ఈ నిధులను వినియోగించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
👉 వరద బాధితుల పునరావాసం, తాగునీటి సరఫరా, వైద్య సేవలు, తాత్కాలిక శిబిరాల ఏర్పాటుకు ఈ నిధులను ఉపయోగించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
🔹 వరదలతో ఇళ్లకు, పంటలకు, రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లినందున తక్షణ ఉపశమనమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

