గుజరాత్లో నిర్మాణ కార్మికుల సంక్షేమం తీవ్ర సంక్షోభంలో పడింది. భవనాలు, రహదారులు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణంలో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ పనిచేసే లక్షలాది కార్మికులు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్నారు.
2006 నుండి గుజరాత్ ప్రభుత్వం నిర్మాణ ప్రాజెక్టులపై సెస్ రూపంలో సుమారు రూ.4,786.60 కోట్లు వసూలు చేసినప్పటికీ, ఆ నిధులను కార్మికుల సంక్షేమం కోసం వినియోగించకుండా ఇతర అవసరాలకు మళ్లించిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలో స్పష్టంగా పేర్కొంది.
నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేయాల్సిన కీలక సంక్షేమ బోర్డు సరిగా పనిచేయడం లేదని, వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. సంక్షేమ నిధులలో 47 శాతం వరకు వివిధ ప్రభుత్వ ఖాతాల్లోనే మూలుగుతున్నాయని కూడా కాగ్ తేల్చింది.
1996లో వచ్చిన చట్టం ప్రకారం ప్రభుత్వం సంక్షేమ బోర్డు, సలహా కమిటీ, సంక్షేమ నిధిని సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉన్నా, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో కార్మికుల గోడును పట్టించుకునే నాథుడు లేక, వారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.

