గాజాలో అమానవీయ దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయిల్ను తిప్పికొట్టేందుకు అరబ్, ఇస్లామిక్ దేశాలు ఉమ్మడి రక్షణ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించాయి. ఖతార్ రాజధాని దోహాలో గల్ఫ్ సహకార మండలి (జిసిసి) సభ్య దేశాల నేతలు, ప్రతినిధులు పాల్గొన్న సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న బహ్రైన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ దేశాధినేతలు ఇజ్రాయిల్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఖతార్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ మాట్లాడుతూ – “మధ్యవర్తులపై ఇజ్రాయిల్ జరిపిన దాడి పిరికిపంద చర్య. గాజాలో శాంతి చర్చలను అడ్డుకోవడమే దాని ఉద్దేశ్యం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల 9న దోహాలో హమాస్ నేతలపై జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు మరణించిన ఘటనను సమావేశం తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయిల్ ప్రాంతీయ ఆధిపత్యాన్ని విస్తరించుకోవాలనే ధ్యేయంతో లెబనాన్, సిరియా, యెమన్లపై కూడా దాడులు జరుపుతోందని ఖతార్ ఎమిర్ ఆరోపించారు.
జిసిసి ప్రధాన కార్యదర్శి జసేమ్ మహమ్మద్ అల్బుదైవీ మాట్లాడుతూ – అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయిల్ను అదుపులో ఉంచాలని హెచ్చరించారు. ఇజ్రాయిల్ మరోసారి ఖతార్పై దాడి చేస్తే అంతర్జాతీయ సమాజం ముందు దానిని బాధ్యుడిగా నిలబెట్టాలని జిసిసి సభ్య దేశాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి.
ఇక టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహిం – యుద్ధ నేరాలకు ఇజ్రాయిల్ అధికారులను అంతర్జాతీయ చట్టాల కింద విచారణకు లోనుచేయాలని పిలుపునిచ్చారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి, ఇజ్రాయిల్ దాడులు స్పష్టమైన అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ ఇజ్రాయిల్ను ఐక్యరాజ్యసమితి నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేయగా, అరబ్–ఇస్లామిక్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని సూచించింది.

