హైదరాబాద్ :: గచ్చిబౌలి కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అరుదైన విజయాన్ని సాధించారు. కేవలం 600 గ్రాముల బరువుతో ఏడో నెలలో పుట్టిన శిశువుకు గుండె సమస్యపై ప్రత్యేక చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి రక్షించారు.
జననం తర్వాత ఆ చిన్నారికి పేటెంట్ డక్టస్ ఆర్టెరివోసస్ (PDA) అనే గుండె సమస్య తలెత్తింది. దీని కారణంగా శిశువును మొత్తం 97 రోజులపాటు ఎన్ఐసీయూలో ఉంచి వైద్యులు పర్యవేక్షించారు.
శస్త్రచికిత్స చేయకుండా, కాలి నరంలో నుంచి 1.2 మిల్లీమీటర్ల పికోలో డివైస్ సాయంతో గుండె రంధ్రాన్ని మూసివేశారు. దీని ద్వారా శిశువు ప్రాణాలు నిలిపి, పూర్తి ఆరోగ్యంతో కోలుకునేలా చేశారు.
వైద్యుల ప్రకారం, ఈ పరికరంతో చికిత్స పొంది కోలుకున్న దేశంలోనే అతి తక్కువ బరువు గల శిశువుగా ఈ చిన్నారి రికార్డు సృష్టించింది.

