నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన ఇసుక టిప్పర్ కారును ఢీకొట్టడంతో క్షణాల్లోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఢీకొట్టిన అనంతరం టిప్పర్ కారును దూరం వరకు లాక్కెళ్లడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
ప్రమాదంలో మృతులు తాళ్లూరు రాధ (38), తాళ్లూరు శ్రీనివాసులు (40), సారమ్మ (40), వెంగయ్య (45), లక్ష్మి (30), డ్రైవర్తో పాటు ఒక చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మృతులంతా నెల్లూరు జిల్లా తాళ్లూరుకు చెందినవారిగా పోలీసులు తెలిపారు. కారు నెంబర్ AP 40HG 0758 తాళ్లూరు రాధ పేరుతో రిజిస్టర్ అయి ఉందని సమాచారం.
కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
.

