కడప నగరంలో మాడిఫై సైలెన్సర్లతో భారీ శబ్దాలు చేస్తూ తిరిగే వాహనదారులపై జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ షెల్ఖే (IPS) కఠిన చర్యలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఏ. వేంకటేశ్వరులు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఈ చర్యలో భాగంగా 50 టూవీలర్ల నుంచి స్వాధీనం చేసుకున్న మాడిఫై సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. అధిక శబ్దం ప్రజలకు అసౌకర్యం కలిగించడం, శబ్ద కాలుష్యం పెరగడం, ప్రమాదాల అవకాశాలు అధికం కావడం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
చట్టపరమైన చర్యలు:
మాడిఫై సైలెన్సర్ వాడితే 3 నెలల జైలు శిక్ష
రూ. 10,000 వరకు జరిమానా
లైసెన్స్ 3 నెలలపాటు రద్దు
మార్పులు చేసిన మెకానిక్లపై క్రిమినల్ కేసులు
తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టాలని, రూ.30 వేల వరకు ఖర్చు చేసి సైలెన్సర్లు బిగించడం తప్పని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
అదనంగా, నగరంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్ చేస్తే వీల్ లాక్స్ వేసి ఫైన్ వసూలు చేస్తామని, టూవీలర్ రైడర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఏ. వేంకటేశ్వరులు, సీఐ డి.కె. జావీద్, ఎస్ఐ యు.వై. జయరాములు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

