ఏర్పేడు మండలం, జంగాలపల్లి:
కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న యుగంధర్ విద్యలో కొత్త చరిత్ర సృష్టించాడు. జైలులో శిక్ష అనుభవిస్తూనే చదువుపై మక్కువతో, పోలీసుల సహకారంతో ఇప్పటివరకు 4 డిగ్రీలు, 3 పీజీలు పూర్తి చేశాడు.
తాజాగా BA పరీక్షల్లో 8.2 పాయింట్లు సాధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఈ ప్రతిభకు గుర్తింపుగా మంగళవారం హైదరాబాద్లో జరిగిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ దూరవిద్య విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవంలో యుగంధర్కు బంగారు పతకంతో పాటు బుక్ ప్రైజ్ అవార్డు అందించారు.
ఈ సందర్భంగా మహిళా శక్తి ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు ఈ. అరుణరెడ్డి మాట్లాడుతూ –“శిక్ష అనుభవిస్తున్నా విద్యతో కొత్త జీవితం నిర్మించుకోవచ్చని యుగంధర్ నిరూపించాడు. ఆయన కృషి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కావాలి” అని పేర్కొన్నారు.

