వారం రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
పాట్నా: బీహార్లో అనేక వివాదాలకు నెలవుగా మారిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణను పూర్తి చేసిన ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను ప్రకటించింది. ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ జాబితాపై వచ్చిన అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను తయారు చేసినట్టు తెలిపింది. బీహార్లో ప్రధాన ఎన్నికల అధికారి తన సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేశారు. ప్రజలు తమ పేర్లను ఙశ్ీవతీర.వషఱ.స్త్రశీఙ.ఱఅ లింక్పై క్లిక్ చేసి చూసుకోవచ్చని తెలిపారు.
త్వరలోనే ఎన్నికల షెడ్యూల్?
బీహార్ ఓటరు తుది జాబితా ప్రకటించడంతో వచ్చేవారం బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూలును కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ చివరలో ఛట్ పండగ తర్వాత తొలిదశ ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం. బీహార్ ఎన్నికలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరగనున్న ఉప ఎన్నికల కోసం ఈసీ 470 మంది పరిశీలకుల్ని నియమించింది. వచ్చేనెల 3న సాధారణ, పోలీసు, వ్యయ పరిశీలకుల వివరాలపై ప్రకటన వెలువడుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
భారీగా ఓటర్ల తొలగింపు
ఎస్ఐఆర్ ప్రక్రియ తరువాత ఎలక్షన్ కమిషన్ బీహార్ ఓటర్ల జాబితాలో చాలా సవరణలు చేసింది. పెద్ద సంఖ్యలో ఓటర్ల తొలగించింది. ముసాయిదా జాబితా ప్రకారం, ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు బీహార్లో 7.89 కోట్ల మంది ఓటర్లు ఉంటే, అందులో 65.63 లక్షల మంది ఓటర్లను తొలగించింది. వీరిలో మరణించిన, నకిలీ పత్రాలు సమర్పించిన వారు ఉన్నట్లు పేర్కొంది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల చిరునామాలను నవీకరించినట్టు తెలిపింది. ఎస్ఐఆర్ ప్రక్రియ కింద కొత్త ఓటర్ల పేర్లను కూడా ఓటరు లిస్ట్లో చేర్చినట్టు స్పష్టం చేసింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 మధ్య ఏకంగా 16.56 లక్షలకు పైగా యువత కొత్తగా ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం ఫారం-6ను సమర్పించారు.
ఎన్నికల కమిషన్ అక్టోబర్ 4-5 తేదీల్లో బీహార్ను సందర్శించనుంది.ఆ తర్వాత ఏ క్షణంలోనైనా బీహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చని తెలుస్తోంది. బీహార్ శాసనసభ పదవీకాలం 2025 నవంబర్ 22న ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 246 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
వేడెక్కుతున్న రాజకీయం
ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీహార్లో రాజకీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్, ఆర్జెడిలతో కూడిన మహాఘట్ బంధన్, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. 1990వ దశకం నుంచి అక్కడి రాజకీయ పటంలో కనిపించకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ పట్టు సాధించేందుకు యత్నిస్తోంది. పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు శ్రమిస్తోంది. అగ్రనేతల యాత్రలతో ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీహార్లోని 80 స్థానాలకు కాంగ్రెస్ తన అభ్యర్థులను ఖరారు చేసింది. మరోవైపు అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ కూడా తాయిలాల మోతతో ఓటర్లను ఆకట్టుకునే పనిలోపడ్డారు. ప్రధాని మోడీ కూడా బీహార్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మరోవైపు 2020 ఎన్నికల్లో సాధించిన విజయాన్ని రిపీట్ చేయాలని బీజేపీ బీటీమ్ మజ్లిస్ కూడా భావిస్తోంది. ఇక ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ కూడా బరిలో ఉంది. ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. దీనితో ఈసారి పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది

