అమరావతి :
రాష్ట్రంలోని ప్రతి అర్హులైన కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ ధర్మమని ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల భూమిని ప్రతి కుటుంబానికి కేటాయించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
దీపావళి కంటే ముందుగానే ఈ నెలలోనే మూడు లక్షల ఇళ్ల గృహప్రవేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదనంగా, వచ్చే ఏడాది జూన్ నాటికి మరో ఆరు లక్షల ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారుల చేతికి అందజేస్తామని హామీ ఇచ్చారు. గృహనిర్మాణంలో ఇది చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని సీఎం అన్నారు.
పేదల సంక్షేమం పట్ల తన ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేసిన ఆయన, గృహనిర్మాణం మాత్రమే కాకుండా ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి రంగాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. పింఛన్లతో పాటు గృహాలను కల్పించడం వల్ల సామాజిక సమానత్వం, జీవన భద్రత కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ చర్యలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం సమగ్ర అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

