విజయవాడ 11 రోజులుగా కొనసాగుతున్న విజయవాడ ఉత్సవ్ ఘనంగా ముగిసింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు నిర్వహించిన సాంస్కృతిక కవాతుకు సీఎం జెండా ఊపి శ్రీకారం చుట్టారు. ఈ కవాతులో మూడు వేలమంది కళాకారులు పాల్గొనగా, డప్పు కళాకారుల ప్రదర్శన గిన్నిస్ బుక్ రికార్డులో చోటు దక్కించుకుంది.
తరువాత సీఎం గొల్లపూడి ఎక్స్పో గ్రౌండ్స్ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన రోబో కిచెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ – “సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజలకు మానసిక ఆనందం కూడా అవసరం. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి. కనుమరుగవుతున్న కళారూపాలను భావితరాలకు అందించాలి” అని అన్నారు.
ఆలయాలు, పుణ్యక్షేత్రాలు మన రాష్ట్రానికి గొప్ప సంపద అని సీఎం పేర్కొన్నారు. టెంపుల్ టూరిజం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజల ముఖాల్లో తిరిగి ఆనందం వెలిసిందని చంద్రబాబు అన్నారు. “ఉచిత బస్సు ప్రయాణం, సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేసిన ఘనత ప్రజలదే. ప్రతి కుటుంబానికి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాం. ప్రజల సహకారంతోనే మరింత అభివృద్ధి సాధ్యం” అని ముఖ్యమంత్రి నాయుడు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ప్రతినిధులు పాల్గొన్నారు.

