ఆంధ్రప్రదేశ్లో చమురు, సహజ వాయువుల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) భారీ ప్రణాళికతో ముందుకొచ్చింది. రాష్ట్రంలోని కృష్ణా–గోదావరి (కేజీ) బేసిన్లో 172 కొత్త బావులను తవ్వేందుకు రూ.8,110 కోట్ల అంచనా వ్యయంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓఎన్జీసీ రూపొందించిన సమగ్ర ప్రణాళికకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఇటీవల షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది.
కోనసీమ ప్రాంతంలోని ఎనిమిది పెట్రోలియం మైనింగ్ లీజ్ (PML) బ్లాకుల్లో ఈ తవ్వకాలు జరగనున్నాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో పర్యావరణ నిర్వహణ ప్రణాళిక కోసం రూ.172 కోట్లు, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలకు రూ.11 కోట్లు కేటాయించినట్లు సంస్థ తెలిపింది.
అయితే, పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నిపుణుల కమిటీ కఠినమైన షరతులు విధించింది. ముఖ్యంగా, తవ్వే బావుల్లో ఏ ఒక్కటీ కోరంగి వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉండరాదని ఆదేశించింది. అదేవిధంగా, అటవీ భూములు లేదా ఇతర సంరక్షిత ప్రాంతాల గుండా పైప్లైన్లు వేయాల్సి వస్తే ముందస్తు అనుమతులు తప్పనిసరి అని పేర్కొంది.
కోనసీమలో చమురు క్షేత్రాల కారణంగా భూమి కుంగిపోవడం, పర్యావరణ ప్రభావాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ షరతులు విధించినట్లు తెలుస్తోంది.
కేజీ బేసిన్లో దాదాపు 69.8 కోట్ల టన్నుల చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని అంచనా. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చేందుకు ఓఎన్జీసీతో పాటు రిలయన్స్ వంటి సంస్థలు కూడా ఈ ప్రాంతంలో అన్వేషణ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి.
ఇంధన రంగ నిపుణుల అంచనాల ప్రకారం, పునరుత్పాదక ఇంధన వినియోగం పెరుగుతున్నా, చమురుకు గిరాకీ తగ్గబోదని, 2050 నాటికి డిమాండ్ దాదాపు రెట్టింపు కానుందని బ్రిటిష్ పెట్రోలియం (BP) నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఉత్పత్తిని పెంచడమే ఓఎన్జీసీ ఈ భారీ ప్రాజెక్టు లక్ష్యమని తెలుస్తోంది.

