ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈనెలలో ఆయన పర్యటన ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే జిల్లాల పర్యటన షెడ్యూల్ను సిద్ధం చేయడానికి ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాట్లు ప్రారంభించింది.
పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ తొలుత పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం వెళ్లనున్నారు. ఇటీవల ఆ ప్రాంతంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై స్పందించిన పవన్, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, హాస్టల్ వసతులు, ఆహార నాణ్యత వంటి అంశాలను స్వయంగా పరిశీలించనున్నారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గురుకుల సంస్థల నిర్వాహకులతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. అనంతరం ఇతర జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యలపై కూడా సమీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఉపముఖ్యమంత్రి పర్యటనపై అధికార యంత్రాంగం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది.

