ఢిల్లీ: దేశ రాజధానిని కుదిపేసిన హృదయ విదారక సంఘటన ఇది. నిద్రలో ఉన్న భర్తపై మరిగిన నూనె కుమ్మరించి, గాయాలపై కారంపొడి చల్లిన భార్య పాశవికతకు అందరూ షాక్ అవుతున్నారు.
ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న దినేశ్ అనే వ్యక్తి భార్య, కుమార్తెతో కలిసి అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్గిర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీ రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరి నిద్రపోయిన దినేశ్పై తెల్లవారుజామున భార్య మరిగిన నూనె కుమ్మరించింది.
ఆ బాధతో మెలకువ వచ్చిన భర్తను చూసి ఆమె మరింత క్రూరంగా గాయాలపై కారంపొడి చల్లింది. బాధితుడి అరుపులు విని పొరుగువారు పరుగున వచ్చి తలుపు పగలగొట్టి లోపలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన దినేశ్ను ముందుగా స్థానిక ఆసుపత్రికి, తరువాత పరిస్థితి విషమించడంతో సఫ్దర్జంగ్ హాస్పిటల్కు తరలించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైందని, వారికి ఒక కుమార్తె ఉన్నదని తెలిపారు. భార్య గతంలో కూడా భర్తపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం హత్యాయత్నం కేసు కింద పోలీసులు విచారణ జరుపుతున్నారు.

