అమరావతి:రాష్ట్రంపై “మోంధా” తుఫాను గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో వేగంగా తీవ్రరూపం దాల్చిన ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.
సముద్రం ఇప్పటికే అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకూడదని అధికారాలు సూచించాయి.గతంలో హుద్ హుద్, తితలి తుఫాన్లు ఆంధ్రప్రదేశ్పై చూపిన విధ్వంసం ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు మళ్లీ అదే భయం కమ్మేస్తోంది.
ఉభయ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలకు అధిక అప్రమత్తత సూచనలు జారీ అయ్యాయి.ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి.
మరోవైపు, తీరం వెంబడి ఉన్న అన్ని పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. అధికారులు విపత్తు నిర్వహణ చర్యలను వేగవంతం చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరప్రాంతాలు దాటరాదని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

