జిల్లా పోలీసు సిబ్బంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన టీఏ బిల్లులు (Travelling Allowances), సరెండర్ లీవ్ బకాయిలు చాలా కాలంగా విడుదల కాకపోవడంతో పోలీసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో పోలీస్ విభాగానికి సంబంధించిన రూ.11.34 కోట్లు టీఏ బిల్లులు, రూ.24 కోట్లు సరెండర్ లీవ్ అమౌంట్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద, ఒక్కో పోలీస్ సిబ్బందికి సగటున రూ.94,500 చొప్పున బకాయిలు రావాల్సి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇక ఇంధన భత్యాలు, యూనిఫామ్ అలవెన్సులు, హౌస్ రెంట్ అలవెన్స్ల చెల్లింపులు కూడా ఆలస్యమవుతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు పై అధికారులకు, జిల్లా కార్యాలయానికి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు.
పండుగల సమయానికీ బకాయిలు విడుదల కాకపోవడంతో కుటుంబ ఖర్చులు భరించడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

