గుంటూరు
గుంటూరు నగరంపై ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి.
బృందావన్ గార్డెన్స్, ఏటి అగ్రహారం, పట్టాభిపురం, బ్రాడీపేట, గుజ్జనగుండ్ల, విద్యానగర్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బృందావన్ గార్డెన్స్లో ఓ కారుపై పెద్ద చెట్టు విరిగిపడింది. అయితే అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారికి ప్రాణాపాయం తప్పింది. భారీ వర్షంతో నగరంలో ట్రాఫిక్కు అంతరాయం కలగగా, వాహనదారులు గంటల తరబడి ఇరుక్కుపోయారు.
పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. మునిసిపల్ సిబ్బంది నీటిని వెలికితీసే పనులు ప్రారంభించారు. వర్షం మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

