ఆదిలాబాద్ జిల్లా : సెప్టెంబర్ 15
ఆదిలాబాద్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడి నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ ఎద్దు ఏకంగా ఓ ఇంటి పైకప్పుపైకి ఎక్కడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.
భోరజ్ మండలం నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గఫూర్ తన ఎద్దును ఇంటి బయట కట్టాడు. అదే సమయంలో గుంపుగా వచ్చిన కొన్ని వీధి కుక్కలు ఆ ఎద్దుపై దాడికి యత్నించాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ఎద్దు తాళ్లు తెంచుకుని పరుగులు పెట్టి, పక్కనే ఉన్న రాళ్ల కుప్పపైకి ఎక్కి అక్కడి నుంచి నేరుగా ఇంటి పైకప్పుపైకి చేరుకుంది.
అక్కడి నుంచి బయటపడలేకపోయిన ఎద్దును చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. చివరకు తాళ్ల సాయంతో చాలా కష్టపడి దానిని కిందకు దించారు. అయితే ఎద్దు పైకప్పుపైకి ఎక్కడం వల్ల ఇంటికి స్వల్ప నష్టం జరిగినట్లు సమాచారం.
ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు స్థానికులు తమ ఫోన్లలో చిత్రీకరించగా… అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

