సిద్దిపేట జిల్లా నర్మెట శివార్లలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ శుక్రవారం విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో అంకురార్పణ జరిగిన ఈ ప్రాజెక్టు, మాజీ మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణలో త్వరితగతిన పూర్తయింది.
ఫ్యాక్టరీలో గంటకు 30 టన్నుల ఆయిల్పామ్ గెలలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో దీనిని గంటకు 120 టన్నుల వరకు పెంచే అవకాశముందని అధికారులు వెల్లడించారు. భారతదేశంలోనే 120 టన్నుల క్రషింగ్ సామర్థ్యం కలిగిన తొలి ఫ్యాక్టరీ ఇదే కావడం విశేషం.
ఈ ఫ్యాక్టరీ ద్వారా సిద్దిపేటతో పాటు సమీప జిల్లాలైన జనగామ, మహబూబాబాద్, గద్వాల, నారాయణపేట, యాదాద్రి–భువనగిరి రైతులు కూడా లాభపడనున్నారు. ఇప్పటికే 820 మంది రైతుల నుంచి 2,350 టన్నుల గెలలను కొనుగోలు చేసి రూ.4 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.
హరీశ్రావు మాట్లాడుతూ, “రైతుల కల సాకారం అయిన రోజు ఇది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంలో ఆయిల్పామ్ రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయి” అని ఆనందం వ్యక్తం చేశారు.
ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే పీచు, వ్యర్థాలను పరుపులు, ఎరువులు, చేపల ఆహారం, బయోగ్యాస్ తయారీలో వినియోగించనున్నారు. దీంతో రైతులకు లాభం మాత్రమే కాకుండా, ప్రత్యక్ష–పరోక్షంగా వెయ్యి మందికిపైగా ఉపాధి లభించనుంది.

