వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ఎన్నుకున్న సభకు హాజరు కాకుండా తాడేపల్లి నుంచి మాత్రమే స్పందించడం సరైంది కాదంటూ ప్రభుత్వ మంత్రులు, టిడిపి నాయకులు, మేధావులు విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే, వైసీపీ వర్గాలు మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయం వెనుక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందని చెబుతున్నాయి. “అసెంబ్లీని వదిలేసినా ప్రజాక్షేత్రాన్ని నమ్ముకున్న నాయకుడు జగన్” అని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. గత ఆరు నెలలుగా రైతులు, విద్యార్థులు, పేదల సమస్యలపై మీడియా సమావేశాలు నిర్వహించి, పార్టీ నేతలను క్షేత్రస్థాయిలో నడిపించడంలో జగన్ విజయవంతమయ్యారని ఆయన పేర్కొన్నారు.
జగన్ సభకు రాకపోయినా ఆయనపై అసెంబ్లీలో చర్చ నడవడం, ఆయన ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నదని ఆయన అనుచరులు అంటున్నారు.
అయితే, సభకు రాకపోవడానికి కారణం స్పీకర్ వైఖరేనని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సీఎంతో సమానంగా మాట్లాడే సమయం లిఖితపూర్వకంగా హామీ ఇస్తే జగన్ తప్పక అసెంబ్లీకి వస్తారని అనంతపురం జిల్లాకు చెందిన ఒక నేత స్పష్టం చేశారు.
మరోవైపు, అసెంబ్లీని పూర్తిగా బహిష్కరించడం సరైన పద్ధతి కాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం, స్పీకర్ ఇద్దరూ మౌనమే కొనసాగిస్తున్నారు.
రాబోయే రోజుల్లో జగన్ తిరిగి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.

