తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలు ఉత్పన్నమవుతున్నాయి. సూపర్ స్టార్ విజయ్పై కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్న సానుభూతి ధోరణి డీఎంకేలో అసంతృప్తికి కారణమవుతోంది. మిత్రపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ తీరుపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటన అనంతరం టీవీకే అధ్యక్షుడు విజయ్కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి పరామర్శించారని ప్రచారం సాగుతోంది. విదేశాల్లో ఉన్న రాహుల్, విజయ్తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా, డీఎంకే వర్గాలు ఈ విషయాన్ని గమనిస్తున్నాయి.
డీఎంకే – కాంగ్రెస్ కూటమిని రాజకీయ శత్రువుగా ప్రకటించిన విజయ్పై కాంగ్రెస్ సానుభూతి చూపడం ఆశ్చర్యకరంగా ఉందని డీఎంకే నేతలు భావిస్తున్నారు. విజయ్ను టార్గెట్ చేసిన డీఎంకే ఇప్పుడు కరూర్ ఘటనను ప్రజల్లో చర్చనీయాంశం చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం విజయ్కు మద్దతు లాంటి ధోరణి చూపించడంపై డీఎంకేలో అసహనం వ్యక్తమవుతోంది.
స్టాలిన్ను పక్కనపెట్టి విజయ్తో కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయ సమీకరణాల వైపు అడుగులు వేస్తోందా? లేకపోతే ఎక్కువ సీట్లు సాధించేందుకు డీఎంకేను ఒత్తిడికి గురిచేయడానికా? అన్న సందేహం తలెత్తుతోంది. ఏదేమైనప్పటికీ, ఈ పరిణామాలు కూటమి భవిష్యత్తుపై మబ్బులు కమ్మినట్టుగా కనిపిస్తున్నాయి.
డీఎంకే వర్గాల అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్ ఇలా కొనసాగితే కూటమిలో విశ్వాసం దెబ్బతింటుందని స్పష్టమవుతోంది. ఇకపై స్టాలిన్ కాంగ్రెస్కు గతంలా పూర్తి మద్దతు ఇవ్వకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

