తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన కవిత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖ పంపారు. ఫోన్ ద్వారా మాట్లాడి, ప్రత్యక్షంగా కలుసుకోవాలని కూడా అభ్యర్థించారు. అయితే ఇప్పటివరకు చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
రాజీనామా ఆలస్యానికి రాజకీయ లెక్కలు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కవిత 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. ఆమె పదవీ కాలం 2028 వరకు ఉంది. ఇప్పుడు రాజీనామా ఆమోదిస్తే తప్పనిసరిగా ఉపఎన్నికలు జరగాలి. కానీ ప్రస్తుతం స్థానిక సంస్థల పదవీకాలం ముగిసింది. ఎన్నికలు జరగాల్సి ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా తేల్చాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయి, తమకే మెజార్టీ వస్తుందని నమ్మకం కలిగితేనే రాజీనామా ఆమోదం వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. అప్పుడు ఉపఎన్నికల ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీటు సాధించవచ్చు.
దీంతో కవిత ఎన్ని ఒత్తిడి తెచ్చినా, స్థానిక ఎన్నికల వరకు ఆమె రాజీనామా ఆమోదం వాయిదా పడే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

