భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ పోలీసులు భారీగా గంజాయి పట్టివేతలో విజయం సాధించారు. సోమవారం రాత్రి బూర్గంపహాడ్ మండల పరిధిలోని మొరంపల్లి బంజర సమీపంలో SI మేడ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి విశ్వసనీయ సమాచారంపై ముట్టడి నిర్వహించి, చింతూరు నుండి హర్యానాకు వెళ్తున్న HR 33B 6330 కారును ఆపి తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో కారులో 204.930 కిలోల గంజాయి బయటపడింది. దీని విలువ మార్కెట్లో రూ.1,02,46,500/-గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో హర్యానా రాష్ట్రానికి చెందిన సంజీవ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు తన యజమాని ప్రిన్స్ కుమార్ ఆదేశాల మేరకు గంజాయి రవాణా చేస్తున్నట్లు విచారణలో తెలిసింది.
పాల్వంచ CI సతీష్ సమక్షంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు ప్రిన్స్ కుమార్, ప్రధాన్ కారా, లఖన్ హంతాల్ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన SI మేడ ప్రసాద్, SI నాగబిక్షం మరియు వారి బృందాన్ని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
రాష్ట్రస్థాయి సోషల్ మీడియాలో కూడా భద్రాద్రి జిల్లా పోలీసుల కృషి విశేషంగా ప్రశంసలు అందుకుంటోంది.

