పుణ్యక్షేత్రం తిరుపతిలో చైన్ స్నాచర్లు చాకచక్యంగా చెలరేగారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రెండు గంటల వ్యవధిలోనే ఐదుగురు మహిళల మెడలోని బంగారు గొలుసులను అపహరించిన ఘటన నగరంలో కలకలం రేపింది.
అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు చోట్ల, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో చోట చైన్ స్నాచింగ్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోస్టల్ కాలనీలో ఓ మహిళ మెడలో గొలుసు తెంపుకెళ్లగా, అలిపిరి పరిధిలో ఉపాధ్యాయ నగర్, గొల్లవాని గుంట, రాయల్ ఓక్ షోరూమ్ సందు, గంగారాం ఫంక్షన్ హాల్ ఎదుట వరుసగా చోరీలు చోటుచేసుకున్నాయి.
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలతో స్థానిక మహిళల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చోరీలపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలాలకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు.
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విలువైన నగలు ధరించి బయటకు రావడంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఒంటరిగా ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మహిళలకు విజ్ఞప్తి చేశారు.

