రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకత లోపిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. అర్హులైన పేదలకందాల్సిన లబ్ధి, స్థానిక శాసకులు, సీనియర్ నేతల ఆధిపత్యానికి బలైపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ మాట్లాడుతూ, పథకంలో ఎంపిక ప్రక్రియలో స్థానిక లీడర్ల జోక్యం వల్ల అర్హులైనవారు అన్యాయం ఎదుర్కొంటున్నారని విమర్శించారు. పేదల హక్కులను కాపాడాలంటే ఎంపిక విధానాన్ని పునర్నిర్వచించి, నిజమైన గృహరహితులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
“అర్హులైన వారు పత్రాలు సమర్పించినా జాబితాలో పేర్లు రావడం లేదు. కానీ అర్హతలేని వారి పేర్లు ఎలా వస్తున్నాయి? ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు” అని ఆకాష్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలు రాజకీయ విశ్లేషకులు కూడా స్పందిస్తూ – ఇందిరమ్మ పథకం రాజకీయ ఆధిపత్యానికి వేదిక కాకుండా, మానవతా దృష్టితో అమలవ్వాలని సూచిస్తున్నారు. కలెక్టర్లు, తహసీల్దార్లు, గ్రామ కార్యదర్శులు వాస్తవ అర్హులను గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.
“ప్రభుత్వం వెంటనే సమగ్ర పరిశీలన చేపట్టకపోతే, రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచే పరిస్థితి ఉండదు” అని ఆకాష్ నాయక్ హెచ్చరించారు.

