రైతులకు యూరియా సరఫరా, వ్యవసాయ ఉత్పత్తులపై శాసనమండలిలో గురువారం తీవ్ర హంగామా నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే చైర్మన్ మోషేన్రాజు దానిని తిరస్కరించడంతో వారు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియంపైకి ఎక్కారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ –
“ప్రభుత్వం ఎక్కడికీ పారిపోవడం లేదు. యూరియా సరఫరాతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపై ఎన్ని గంటలైనా చర్చించడానికి సిద్ధమే. రేపు జరిగే బీఏసీ సమావేశంలో చర్చ సమయం నిర్ణయిస్తాం” అని స్పష్టం చేశారు.
అయితే వైసీపీ సభ్యులు “ఇప్పుడే.. ఇక్కడే చర్చించాలి” అని పట్టుబట్టారు. దీంతో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం తలెత్తగా, చైర్మన్ సభను వాయిదా వేశారు.
తర్వాత సభ తిరిగి ప్రారంభమైనా వైసీపీ సభ్యులు మరోసారి వెల్లోకి వెళ్లారు. ఈ సమయంలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ –
“యూరియా రైతుల జీవితాల్లో అత్యంత కీలకం. ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఎల్లుండిదాకా ఎందుకు వాయిదా? అన్నీ రద్దు చేసి ఇప్పుడే చర్చించాలి. గతంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కలేదా?” అని ప్రశ్నించారు.
దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ –
“గత ప్రభుత్వ కాలంలో ఏం జరిగిందో, మా ప్రభుత్వం 15 నెలల్లో ఏం చేసిందో ప్రజలకు తెలియాలి. చర్చకు సిద్ధమే” అని పునరుద్ఘాటించారు.
చివరికి చైర్మన్ హామీ ఇవ్వడంతో వైసీపీ సభ్యులు నిరసన విరమించి కూర్చున్నారు.
👉 యూరియా సరఫరా, రైతు సమస్యలపై చర్చకు శుక్రవారం బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

