రూ.3.8 కోట్లు దోచుకున్న స్కామర్లు – కర్నూల్ పోలీసులు ముగ్గురి అరెస్ట్
కర్నూల్ :
ట్విట్టర్ (X)లో నకిలీ ఖాతా తెరిచి న్యూడ్ వీడియోలు పంపిస్తూ ఒకరిని ఉచ్చులో వేసి కోట్ల రూపాయలు దోచుకున్న సంఘటన కర్నూలులో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే… కర్నూలుకు చెందిన ఓ వ్యక్తికి సంయుక్త రెడ్డి పేరుతో ఓ ఖాతా నుంచి న్యూడ్ వీడియోలు పంపుతూ పరిచయం ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత ఒక మహిళ వీడియో కాల్స్లో న్యూడ్గా మాట్లాడి అతనిని బలహీనంగా మార్చింది. అనంతరం తక్కువ ధరలకు పొలాలు, స్థలాలు అమ్ముతామని నమ్మబలికి, గత రెండు సంవత్సరాల కాలంలో మొత్తం రూ.3.80 కోట్లు దోచుకున్నారు.
చివరికి తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కర్నూల్ పోలీసులు, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన చిక్కిరి మల్లేష్, అతని భార్య పెరుమాళ్ల మేరీ, స్నేహితురాలు మొల్లం మల్లిక అలియాస్ లిల్లీలను అరెస్ట్ చేశారు.
డిగ్రీ చదివిన వీరు సులభంగా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కారని దర్యాప్తులో తేలింది. మోసపూరితంగా దోచుకున్న రూ.3.80 కోట్లలో,
రూ.41.26 లక్షలతో రెండు కార్లు, ఒక బైకు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు.
మిగిలిన రూ.3.38 కోట్లు జల్సాలు, ఇతర ఖర్చులకు వాడేశారని నిందితులు విచారణలో ఒప్పుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కర్నూల్ పోలీసులు వెల్లడించారు.

